Kamareddy: విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు
కామారెడ్డి (CLiC2NEWS): కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని యశోద మెడికల్ సెంటర్ కామారెడ్డి వైద్యులు డాక్టర్ పి విజయ్ వర్మ తెలిపారు. కామారెడ్డి యశోదలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య నిపుణులు కిడ్నీ మార్పిడిలో తాము విజయం సాధించిన విశేషాలను వివరించారు. హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డును నెలకొల్పిందన్నారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి, ఆయన బృందం ఇప్పటివరకు వరుసగా 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను అత్యంత విజయవంతంగా నిర్వహించి, ఎంతో మంది జీవితాలను పునరుద్ధరించగలిగారన్నారు. సాధారణంగా కిడ్నీ మార్పిడికి రక్త గ్రూపులు కలవడం అవసరం. అయితే యశోద హాస్పిటల్స్ బృందం బ్లడ్ గ్రూప్ వేరుగా ఉన్న రోగులకు కూడా (ABO-Incompatible Transplant) విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించి, వారి ప్రాణాలను కాపాడటంలో విజయం సాధించినట్లు తెలియజేశారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.