Corona: కాస్త తగ్గిన రోజువారీ కరోనా కేసులు, మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు రోజులుగా 4 వేల కంటే అధికంగా మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా ఈ పరంపరకు కాస్తా బ్రేక్ పడింది. ఆదివారం ఆ సంఖ్య 3.6 లక్షలకు పడిపోయింది. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేల దిగువకు పడిపోయాయి.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,74,606 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,66,161 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర వైద్యా ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,26,62,575కు చేరింది. ఇందులో 1,86,71,222 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 37,45,237 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3,754 మంది బాధితులు కరోనాతో మరణించడంతో మొత్తం మృతులు 2,46,116కు పెరిగారు. అదేవిధంగా కొత్తగా 3,53,818 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రంలో ఒకేరోజులో 48,401 కేసులు, 572 మంది మరణించారు. ఇక కర్ణాకటలో 47,930 మంది కరోనా బారినపడగా, 490 మంది బాధితులు మృతిచెందారు. కేరళలో 35,801 కేసులు నమోదవగా, ఉత్తరప్రదేశ్లో 296 మంది చనిపోయారు.