TS: త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ: హోంమంత్రి

సంగారెడ్డి (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే వివిధ విభాగాల్లో 20 వేల పోలీసు నియామకాలను చేపట్టనున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. శనివారం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ప్రొటెం చైర్మన్ వి. భూపాల్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐజీ (వెస్ట్ జోన్) స్టీఫెన్ రవీంద్ర, డీఐజీ నిజామాబాద్ రేంజ్ శివశంకర్ రెడ్డి, పోలీసు సూపరింటెండెంట్ ఎస్ చంద్రశేకర్ రెడ్డి, అదనపు ఎస్పీ కె. శ్రుజన, అదనపు కలెక్టర్ జె. వీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో హోంమంత్రి మాట్లాడుతూ.. పోలీసుశాఖకు ముఖ్యమంత్రి కెసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. పోలీసుశాఖ నూతన వాహనాలు సమకూర్చుకోవడం గానీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ సమర్థ పోలీసింగ్ను నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలోని పోలీసులు గంటల్లోనే కేసులను ఛేదించగలుగుతున్నట్లు చెప్పారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు దాదాపు 80 వేల మందికి పైగా రిక్రూట్ చేసినట్లు చెప్పారు. మహిళా ప్రాధాన్యతలో భాగంగా నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. మహిళలకు రక్షణ నిమిత్తం షీ టీమ్స్ ఏర్పాటును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే శాంతిభద్రతలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న హోంమంత్రి దేశంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో 70 శాతం తెలంగాణలోనే ఉన్నాయన్నారు. కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు పోలీసుల పనిని సులభతరం చేస్తున్నట్లు తెలిపారు.