పంజాబ్ సిఎంగా చరణ్‌జీత్‌ సింగ్ చ‌న్నీ ప్రమాణం

చండీగఢ్‌ (CLiC2NEWS): పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా ద‌ళిత నేత చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. ఆయ‌న త‌ర్వాత కాంగ్రెస్ నేత‌లు సుఖింద‌ర్ ఎస్ రంధ్వానా, ఓపీ సోనీ ఉప ముఖ్య‌మంత్రులుగా ప్ర‌మాణం చేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ, పంజాబ్ వ్య‌వ‌హారాల బాధ్యునిగా ఉన్న ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌రీశ్ రావ‌త్‌, రాష్ట్ర పిసిసి చీఫ్ న‌వ‌జోత్ సింగ్ సిద్దూ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సీఎంకు రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా చన్నీ నిలిచారు. కాగా, రెండు రోజుల క్రితం సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్‌ కొత్త సీఎంగా చన్నీని కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక చేసింది. ఈనేపథ్యంలో ఆయన నేడు ప్రమాణం చేశారు. పంజాబ్‌లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

చన్నీ మాల్వా బెల్డ్‌లో రూప్‌నగర్‌ జిల్లాలోని చామ్‌కౌర్‌ సాహిబ్‌ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అమరీందర్‌ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

Leave A Reply

Your email address will not be published.