రాజ్యసభ నుండి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు
ధర్నా విరమించిన బహిష్కృత ఎంపీలు..
న్యూఢిల్లీ : ఎనిమిది మంది ఎంపిలపై సస్పెన్షన్ వేటును వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్షాలు మంగళవారం రాజ్యసభ నుండి వాకౌట్ చేశాయి. అనంతరం సస్పెన్షన్ వేటు పడిన ఎంపిలకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టాయి. ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్ను రద్దు చేయడంతో పాటు మూడు కీలక డిమాండ్లను కేంద్రం ఆమోదించేవరకు రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ప్రకటించారు.కాగా, సోమవారం రాజ్యసభలో సస్పెండ్ వేటు పడిన ఎంపిలు రాత్రి నుండి పార్లమెంట్ ఆవరణలోనే ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ నుంచి మూకుమ్మడిగా వాకౌట్ చేశాయి. తొలుత కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీ, టీఎంసీ, వామపక్షాలు వాకౌట్ చేయగా… కొద్ది సేపటికే ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఆర్జేడీ ఎంపీలు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. సభ నుంచి వాకౌట్ చేయవద్దనీ.. చర్చలో పాల్గొనాలంటూ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. కాగా అంతకు ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు సభా కార్యకలాపాలను ప్రతిపక్షాలు బహిష్కరిస్తాయని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన నేపథ్యంలో బహిష్కృత ఎంపీలు ఇవాళ ధర్నా విరమించారు. ‘‘మిగతా పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలన్నీ బహిష్కరించాయి. తాము కూడా సమావేశాలను బహిష్కరించినందున సస్పెండ్ అయిన ఎంపీలంతా ధర్నా విరమించాలంటూ వారు కోరారు. అందుకే మేము ధర్నా ముగిస్తున్నాం..’’ అని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ పేర్కొన్నారు. తాము కేవలం సస్పెన్షన్ ఎత్తివేయాలని మాత్రమే కోరడం లేదనీ… ఎలాంటి ఓటింగ్ లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను కూడా వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
