ఖాజాగూడ ఎస్టీపీ పనులను పరిశీలించిన జలమండలి ఎండీ దానకిశోర్
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి నూతనంగా నిర్మిస్తున్న ఎస్టీపీల పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. ప్యాకేజ్-3లో భాగంగా ఖాజాగూడలో నిర్మిస్తున్న 21 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ని సోమవారం ఆయన పరిశీలించారు. ఎస్టీపీ పనుల పురోగతిని ఆయన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీపీ నిర్మాణం జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న చెరువుకు ఎలాంటి నష్టం లేకుండా చూడాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో గార్డెన్ ఏర్పాటుచేసి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు. అలాగే, స్థానికుల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు ఎస్టీపీ నిర్మాణ పనులు జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఇందుకు తగ్గట్లుగా కార్మికులు, యంత్రాలు, నిర్మాణ సామాగ్రిని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో తగు రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం, ఇదివరకే జలమండలి నిర్మించిన ఎస్టీపీని సందర్శించి ఇన్లెట్, అవుట్లెట్ పరిశీలించి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.