అక్రమ నల్లా కనెక్షన్లు పొందిన ఇద్దరిపై కేసు నమోదు

హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన ఇద్దరు వ్యక్తుల మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ ఆండ్ ఎం డివిజన్ – 22 పరిధిలోని తుర్కయంజాల్ సెక్షన్ పరిధిలో రెండు అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించడంతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే… తుర్కయంజాల్లోని సూరజ్నగర్ కాలనీ ఫేజ్ -3లో నివసించే టి.ప్రదీప్, వై.చిట్టిబాబు అనే వ్యక్తులు తమ నివాసాలకు అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించడంతో పాటు అక్రమ కనెక్షన్లు తీసుకున్న టి.ప్రదీప్, వై.చిట్టిబాబుపైన ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందంకు లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరని జలమండలి అధికారులు తెలియజేశారు.