విశాఖ టు అనంతపురం.. వైఎస్ఆర్సిపి బస్సు యాత్ర..
ఈ నెల 26 నుండి ఎపి మంత్రుల బస్సు యాత్ర
అమరావతి (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు ఎపి మంత్రులు సిద్ధమవుతున్నారు. బసి, ఎస్సి,ఎస్టి, మైనారిటి మంత్రులతో బస్సు యాత్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 26వ తేది నుండి 29వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో 17 మంది మంత్రులు పాల్గొననున్నట్టు సమాచారం.విశాఖపట్నం నుండి ప్రారంభమై ఈ యాత్ర అనంతపురంలో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పట్టణాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది.
శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మంత్రులు ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ యాత్ర ద్వారా మంత్రులు ప్రజలకు వివరించనున్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ స్థానాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యతను ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎపిలో ప్రస్తుతం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు చేస్తుండగా.. మంత్రులు బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.