అక్రమ నల్లా కనెక్షన్లు పొందిన వారిపై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన 16 మంది వ్యక్తుల మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మూడు భవనాలకు తీసుకున్న అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించారు.
వివరాలు బండ్లగూడ జాగీర్లోని గంధంగూడ పరిధిలో గల వెస్ట్ ఎండ్ కాలనీలోని ఓ బహుళ అంతస్థుల భవనానికి 20 ఎంఎం పైప్ సైజు అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు విశ్వేశ్వర్రెడ్డి అనే వ్యక్తితో పాటు మరో 13 మందిపైన నార్సింగి పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే ఏరియాలోని మరో భవనానికి 20 ఎంఎం పైప్సైజ్ అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్న శ్రీపాదరావు అనే వ్యక్తిపైనా నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
హైదర్గూడలోని ముత్యాలబాగ్లో నివసించే మహ్మద్ సాధిక్ తన ఇంటికి 15 ఎంఎం పైప్ సైజ్ నల్లా కనెక్షన్ తీసుకున్నట్లు గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు అతడిపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరని ప్రకటనలో తెలిపారు.