పోలవరంతో భద్రాచలానికి ముంపు ముప్పు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉందని, ఈ మధ్యకాలంలో వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ రవాణా వాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. భద్రాచలం ముంపు ప్రాంతానాకి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు త్వరలోనే చేపడతామని మంత్రి చెప్పారు. టిఆర్ ఎస్ శాసన సభా పక్ష కార్యాలయంలో మీడియాతో మంగళవారం మంత్రి పువ్వాడ మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు.
పోలవరం ఎత్తు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని మంత్రి పేర్కొన్నారు. పోలవరంతో భద్రాచలానికి ఉన్న ముంపు ముప్పును నివారించాలని మంత్రి డిమాండ్ చేశారు. భద్రాచలం ఇరువైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు, ముంపు బాధితులను ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ ప్రకటించిన చర్యలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఎపిలో విలీనమైన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఈ ఐదుగ్రామాలు దూరంగా ఉంటాయని.. దీనిపై కేంద్రం సర్కార్ ఆలోచించాలని కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని చాలా సార్లు కోరామని ఈ సందర్భంగా మంత్రి అజయ్ గుర్తు చేశారు.