నాయిని కన్నుమూత

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, కార్మిక నాయకుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. హెచ్‌ఎంఎస్‌లో సామాన్య కార్యకర్తగా పని చేసిన నాయిని అంచెలంచెలుగా హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అక్కడ నుంచి 1978లో జనతాపార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అటు కార్మిక రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ నాయిని నర్సింహారెడ్డి రాణించి రాష్ట్రంలో తనదైనముద్ర వేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఆయన మృతి చెందిన విషయం తెలిసి కార్మికులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

బుధ‌వారం అపోలో హాస్పిట‌ల్‌లో నాయిని న‌ర్సింహారెడ్డి అల్లుడు శ్రీ‌నివాస్‌రెడ్డిని ఓదార్తున్న ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

 

నాయిని ప్ర‌స్థానం

నాయిని నర్సింహారెడ్డి 1940 మే 12న వ్యవసాయ కుటుంబానికి చెందిన సుభద్రమ్మ, దేవారెడ్డి దంపతులకు నల్గొండ జిల్లా దేవరకొండ తాలుకాలోని నేరెడుగొమ్మ గ్రామంలో జన్మించారు. నాయిని నేరెడుగొమ్మలోనే నాలుగో తరగతి వరకు చదివారు. హైస్కూల్‌ విద్యను దేవరకొండలోని ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎ్‌ససీ పూర్తి చేశారు. ఒకవైపు విద్యనభ్యసిస్తూనే తండ్రికి వ్యవసాయంలో తనవంతు సహకారం అందించే వారు. హెచ్‌ఎ్‌ససీ పూర్తి చేసిన నాయిని 1958లో డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా ఆధ్వర్యంలో సోషలిస్టు పార్టీలో సభ్యత్వం పొందారు. ఆయన తండ్రి దేవారెడ్డికూడా సోషలిస్టు పార్టీలో చురుకైన పాత్రను పోషించడంతో ఆయనను పోలీ్‌సయాక్షన్‌లో నాడు కాల్చి చంపారు. అప్పుడు నాయిని పెద్దనాన్న కొడుకు అయిన రాఘవరెడ్డితో కలిసి దేవరకొండలో సోషలిస్టు పార్టీని స్థాపించారు. విద్యార్థి దశలో 1956లో వచ్చిన ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో, ముల్కి పాలన వ్యతిరేక పోరాటంలో, తెలంగాణలో ఆంధ్రాను విలీనం చేయవద్దని జరిగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1960లో జరిగిన తాళా తోడో (గోదాముల ముట్టడి) ఉద్యమంలో సోషలిస్టు పార్టీ తరఫున పాల్గొన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1969లో జయప్రకాశ్‌నారాయణ శిష్యుడిగా జనతాపార్టీ నుంచి రాజకీయజీవితాన్ని ప్రారంభించారు. 1978, 1985లో జనతాపార్టీ తరఫున ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. నాటి సిఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మంత్రి వ‌ర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రి (2005-2008)గా పనిచేశారు. 2014 జూన్‌ 2న ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రి (2014-2019)గా పనిచేశారు

2 Comments
  1. […] నాయిని కన్నుమూత […]

Leave A Reply

Your email address will not be published.