వాస్తవాల్ని ఒప్పుకుంటాయో లేదో
దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్లకు డిపాజిట్లు దక్కవు: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతాంగానికి నేరుగా డబ్బులు అందించిన ఘనత తెలంగాణదని, ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్లో కూడా ఇదే స్పష్టమైందని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… తమ ప్రణాళిక సంఘం విడుదల చేసిన రిపోర్ట్లో తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని తెలిపిందన్నారు. రైతుబంధు లబ్ధిదారులు చిన్న, సన్నకారు రైతులే అని తేలిందన్నారు. వాస్తవాల్ని ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయో లేదో చూడాలన్నారు.
ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ తీసుకున్న పథకాల వల్లే టీఆర్ఎస్ గెలుస్తుందని, అసాధారణ ఫలితాలు ప్రజలు ఇస్తున్నారన్నారు. దుబ్బాక ఎన్నికలో కూడా తామే గెలుస్తున్నామని గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆలోచన సరళి, విశ్వాసం టీఆర్ఎస్ పైనే ఉందని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రావని అర్థం అవుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాకు మాత్రమే ఎక్కువ అని, ప్రజలకు చేసిందేమీ ఉండదు మంత్రి విమర్శించారు. దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదన్నారు. ఈ ఉప ఎన్నికలో గతంలో కంటే అధిక మెజార్టీ టీఆర్ఎస్ పార్టీ సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టే.. ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీది కచ్చితంగా వాట్సాప్ యూనివర్సిటీయే అని ఎద్దెవా చేశారు. రాష్ర్టంలో అన్నింటికీ డబ్బులు తామే ఇస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. రఘునందన్ రావు ఇంట్లో దొరికిన డబ్బు మాత్రం తమది కాదంటున్నారు. కానీ ఆ నగదుకు సంబంధించిన సాక్ష్యాలు బయటపడిన విషయం అందరికీ తెలుసు అని కేటీఆర్ చెప్పారు. దుబ్బాకకు బీజేపీ, కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీని అడగడం సరికాదన్నారు. కేంద్రం నిధుల వాటాపై చర్చ పెడుదామని హరీష్ రావు సవాల్ చేస్తే బీజేపీ నేతలు పారిపోయారు అని అన్నారు.