AP: మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా
అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశం
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రూ.100 జరిమానా విధించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ పరిస్థితిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఇప్పటికే ఎపిలో 1 నుండి 9 తరగతులకు సెలవులు ప్రకటించిన సర్కార్…పది, ఇంటర్ తరగతులకు పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు సైతం మూసివేయాలని ఆదేశించింది. పంక్షన్ హాళ్లలో రెండు కుర్చీల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ధియేటర్లలో కూడా సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.