చేనేత వర్గాలకు నూరు శాతం ఉజ్వల భవిష్యత్ అందిస్తా: సిఎం కెసిఆర్
ఎల్ రమణను సిఎం కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ..
టిఆర్ ఎస్ లోకి ఎల్.రమణకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని సిఎం అన్నారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందించడానికే ఎల్.రమణ పార్టీలో చేరారన్నారు. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. చేనేత సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఎవరు చనిపోయినా రైతుబీమా లాగా బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిరిసిల్ల పర్యటనలో ఇది ఇప్పటికే చెప్పామని గుర్తుచేశారు.
“చేనేత వర్గంలో నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉంది. ఈవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ప్రస్తుతం టిఆర్ ఎస్లో నేతలెవరూ లేరు. పెద్ద జనాభా, సమస్యలు ఉన్నటువంటి వర్గం. రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లేదని ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేశాం. చేనేత సామాజిక వర్గం అనుభవిస్తున్న బాధలు చాలా ఉన్నాయి.“ అని సిఎం తెలిపారు.

(తప్పక చదవండి:టిఆర్ఎస్లో చేరిన ఎల్ రమణ)
చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకే..వరంగల్ జిల్లాకు చెందిన చేనేత కార్మికులు సూరత్లో ఉన్నారని… వారి సమస్యలపై అక్కడకు అధికారులను పంపామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో జౌళి పరిశ్రమను ప్రోత్సహిస్తే తిరిగివస్తామని వారు చెప్పారని తెలిపారు. వరంగల్లో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేశామని… ఇటీవలే జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు. వరంగల్లో భారీ టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అపారెల్ పార్క్లతో చేనేత జీవన ముఖచిత్రం మారుతుందనే విశ్వాసం ప్రకటించారు. చేనేతకు రాజకీయ ప్రాతినిధ్యం కోసం త్వరలో శుభవార్త చెబుతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.