ఇంజినీరింగ్ చదివే బాలికలకు రూ. 50వేల స్కాలర్షిప్ పొందే అవకాశం..
AICTE Pragati Scholarship: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్కికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) ప్రగతి స్కాలర్షిప్ (Scholarship) ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 5వేల స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు 566 .. తెలంగాణకు 424 స్కాలర్షిప్లు కేటాయించారు. ఇంజినీరింగ్ , టెక్నాలజి వంటి డిగ్రీ కోర్సులు చదువుతున్న బాలికలకు ఈ పథకం ద్వారా ఆర్ధిక సహాయం పొందవచ్చు. 10+2 లేదా సమాన అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. రాష్ట్రాల వారీగా మెరిట్ లిస్ట్ ద్వారా స్కాలర్షిప్లు కేటాయిస్తారు.
ఎఐసిటిఇ ఆమోదించిన విద్యాసంస్థల్లో డిగ్రీ మొదటి ఏడాదిలో లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి విద్యా సంవత్సరానికి రూ.50వేలు చొప్పున ఆర్ధిక సహాయం పొందవచ్చు. కుటుంబంలోని ఇద్దరు బాలికలు ఈ స్కాలర్షిప్ పొందవచ్చు. వారి కుటుంబ ఆదాయం అన్ని వనరులు నుండి కలిపి రూ. 8 లక్షలు మించకూడదు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. మెదటి ఏడాది ప్రవేశం పొందిన విద్యార్థినులకు గరిష్టంగా 4ఏళ్లు ఆర్ధిక సహాయం అందుతుంది. లైటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారికి 3 సంవత్సరాలు ఆర్థిక సహాయం అందుతుంది.
ముఖ్యమైన వివరాలు:
అర్హత పరీక్ష ఉత్తీర్ణత, డిగ్రీ ప్రవేశం మధ్య గ్యాప్ రెండేళ్లకు మించకూడదు.
మరే ఇతర స్కాలర్షిప్లు కానీ.. ఆర్ధిక సహాయం కానీ పొందుతున్న వారు ఈ స్కాలర్షిప్కు అనర్హులు.
ప్రతి ఏడాది ఎన్ ఎస్పి ద్వారా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థినులు ఒకవేళ తదుపరి తరగతికి ప్రమోట్ కాకపోతే ఈ పథకం నిలిపివేయబడుతుంది.
దరఖాస్తు చేయు విధానం:
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు చదువుతున్న కాలేజ్ దరఖాస్తును ధ్రువీకరిస్తుంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిశీలన అనంతరం స్కాలర్షిప్ మంజూరు చేయబడుతుంది.