TS: జులై 1 నుంచి ఆన్​లైన్​ తరగతులు: మంత్రి సబిత

హైద‌రాబాద్ (CLiC2NEWS): జులై 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. స్మార్ట్​ ఫోన్లు, ఇంటర్​నెట్​ సౌకర్యం లేనివారికి గతేడాది మాదిరిగానే.. దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ బోధన నిర్వహిస్తామని తెలిపారు. విద్యా సంస్థ‌ల పునఃప్రారంభం, ఇత‌ర అంశాల‌పై విద్యాశాఖ అధికారుల‌తో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మీక్షించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు.

పిల్ల‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆన్‌లైన్‌లోనే బోధ‌న కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆదేశించారు. ఆ మేర‌కు జులై 1వ తేదీ నుంచి కేజీ టూ పీజీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లోనే బోధ‌న కొన‌సాగుతుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. సెట్స్‌కు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పుల్లేవు. ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన తేదీల ప్ర‌కార‌మే ప్ర‌వేశ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. విదేశాల‌కు వెళ్లే విద్యార్థుల‌కు నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌ను కూడా జులై నెల‌లో నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దు కావ‌ని మంత్రి స‌బిత స్ప‌ష్టం చేశారు.

అలాగే 50 శాతం మంది టీచ‌ర్లు మాత్ర‌మే విధుల‌కు హాజ‌రు కావాలి. రోజు విడిచి రోజు టీచ‌ర్లు విధుల‌కు హాజరు అవ్వాల్సి ఉంటుంద‌ని టీచ‌ర్ల హాజ‌రుపై మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు త‌ప్ప‌నిస‌రిగా 46 జీవోను అమ‌లు చేయాలి. ట్యూష‌న్ ఫీజును మాత్ర‌మే తీసుకోవాలి మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.