కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా షర్మిల
ఇడుపులపాయ (CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపిగా పోటి చేస్తున్నానని.. ఈ నిర్ణయం అంత సులువైంది కాదని ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఇడుపులపాయలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగనన్న కడప ఎంపి టికెట్ ఇచ్చి.. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని షర్మిల ఆరోపించారు. మా చిన్నాన్నను హత్య చేసిన వారిని, చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారన్నారు. హంతకులు తప్పించుకొని తిరుగుతున్నా శిక్ష పడకుండా జగన్ వారిని కాపాడుతున్నారన్నారు.
నేను పోటీ చేస్తే మా కుటుంబం నిట్ట నిలువుగా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నానని షర్మిల తెలిపారు. చిన్నాన్న చివరి కోరిక తాను కడప ఎంపిగా పోటీ చేయాలని, ఆయన కోరిక నెరవేర్చడానికి బరిలోకి దిగుతున్నానన్నారు. ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఆమె తల్లి విజయమ్మ వైఎస్ ఆర్ ఘాట్ వద్ద తమ కుటుంబానికి వచ్చిన ఈ పరీక్షలో నెగ్గేలా చేయమని ప్రార్ధించారు.