ఆరేండ్లలో కొత్తగా వెయ్యి సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం: మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలో కొత్తగా వెయ్యి 33/11kv సబ్స్టేషన్లు నిర్మించామని ఆర్థిక మంత్రి హరీష్రావు అన్నారు. మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేటలో రూ.12.38 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 కేవీ సబ్స్టేషన్ను బుధవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఏమొస్తుంది.. అంతా చికటే మిగులుతుందని సమైక్యవాదులు చెప్పారని, కానీ రాష్ట్రంలో నేడు రెప్పపాటు కూడా విద్యుత్ కోతలు లేవని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలే తప్ప మరేమీ లేదని విమర్శించారు. కానీ నేడు రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని, దేశంలో మరెక్కడైనా ఇలా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినప్పుడు 7,778 మెగావాట్లు డిమాండ్ ఉండేదని, ఇప్పుడు అది 16,249 మెగావాట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు.