నేటినుంచి ఓటీపీతో రేషన్ బియ్యం
హైదరాబాద్: నేటి (సోమవారం) నుంచి రేషన్ బియ్యం బయోమెట్రిక్ విధానానికి బదులుగా ఓటీపీ ఆధారంగా పంపిణీ చేయనున్నారు. కార్డుదారుల ఫోన్ నంబర్ ఆధార్తో అనుసంధానం తప్పనిసరికానున్నది. అయితే ఇందులో కార్డు ఎవరి పేరు మీదైతే ఉంటుందో వారి ఫోన్ నంబరు మాత్రమే ఆధార్కు అనుసంధానం ఉండాల్సిన అవసరం లేదు. కార్డులో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరిదైనా సరే ఫోన్ నంబర్ ఆధార్తో అనుసంధానం ఉంటే సరిపోతుంది. అయితే వారే కచ్చితంగా రేషన్ షాపునకు వెళ్లాల్సి ఉంటుంది. కాగా ఈ మేరకు రేషన్కార్డుదారులు ఆధార్తో ఫోన్ నంబరు అనుసంధానం చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో బయోమెట్రిక్ ను తాత్కాలికంగా కొంతకాలం నిలిపివేశారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి బయోమెట్రిక్ను అమలు చేయాలని నిర్ణయించారు. కానీ ఈ విధానం అమలుపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు బయోమెట్రిక్కు ప్రత్యామ్నాయమార్గాలను అమలుచేయాలని సర్కార్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఓటీపీ లేదా ఐరిస్ ద్వారా పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఒకటవ తేదీ నుంచి ఒటిపితో రేషన్ పంపిణీ పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. కాగా రాష్ట్రంలో మొత్తం 87.54 లక్షల కార్డులు ఉండగా ఇందులో కేంద్రం ఇచ్చినవి 53.30 లక్షలు కాగా 34.25 లక్షలు రాష్ట్రం ఇచ్చినవి ఉన్నాయి. ఇంత భారీ సంఖ్యలో ఉన్న కార్డుదారుల్లో ఎందరు ఫోన్లు వాడుతున్నారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికీ ఫోన్లు వాడని వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి విషయంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని పలువురు చర్చించుకుంటున్నారు.