చంద్రుని వైపు మానవయానం…
విజ్ఞానానికి వెన్నెల దారి!
నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం
చంద్రుడిపై అడుగు.. విశ్వంలో మానవుడి ముద్ర
“చందమామ రావే…” అంటూ ప్రతి తెలుగు ఇంటిలో చిన్నారుల ఊహలకు రెక్కలు తొడిగిన చంద్రుడు… నేడు ప్రపంచ శాస్త్రవేత్తల పరిశోధనలకు కేంద్రబిందువుగా నిలిచాడు. ఒకప్పుడు కవుల కలంలో వెన్నెల కురిపించిన చంద్రుడు, నేడు అంతరిక్ష పరిశోధనలకు మార్గదర్శకుడిగా మారాడు. 1969 జూలై 20న మానవుడు తొలిసారిగా చంద్రునిపై అడుగుపెట్టి విశ్వచరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించాడు. ఆ చారిత్రక ఘట్టానికి నేడు 57 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జూలై 20ను అంతర్జాతీయ చంద్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అపోలో-11
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన అపోలో-11 యాత్ర మానవ చరిత్రలో అత్యంత గొప్ప విజయాల్లో ఒకటి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై తొలి అడుగు వేస్తూ చెప్పిన “మనిషికి ఇది ఒక చిన్న అడుగు… మానవజాతికి ఒక మహోన్నత దూకుడు” అనే మాటలు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయాయి. అనంతరం బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రునిపై అడుగుపెట్టగా, మైఖేల్ కాలిన్స్ చంద్రుని కక్ష్యలో వ్యోమనౌకను నడిపిస్తూ కీలక బాధ్యత నిర్వర్తించారు.
చంద్రుడి వైపు భారత్ ప్రయాణం
ఒకప్పుడు ఇతర దేశాల విజయాలను ఆశ్చర్యంగా చూసిన భారత్… నేడు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చంద్రయాన్-1 ద్వారా చంద్రునిపై నీటి ఆనవాళ్లను గుర్తించిన ఇస్రో, చంద్రయాన్-2 ద్వారా అమూల్యమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించింది. చంద్రయాన్-3 విజయంతో చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇది భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, యువతలో శాస్త్రీయ దృక్పథానికి ప్రతీకగా నిలిచింది.
భారతీయ సంస్కృతిలో చంద్రుడి స్థానం..
మన సంస్కృతిలో చంద్రుడు కేవలం భూమి ఉపగ్రహం కాదు. వేదాలు, పురాణాలు, జ్యోతిషశాస్త్రంలో చంద్రుడికి విశిష్ట స్థానం ఉంది. చంద్రుడు మనసుకు అధిపతి, శాంతి, చల్లదనం, సౌందర్యానికి ప్రతీకగా భావిస్తారు. పరమశివుని జటాజూటంలో చంద్రుడు అలంకారంగా ఉండడం, శ్రీకృష్ణుడి వంశాన్ని చంద్రవంశంగా పేర్కొనడం, పౌర్ణమి–అమావాస్యల ఆధారంగా పండుగలు, వ్రతాలు నిర్ణయించడం మన సంస్కృతిలో చంద్రుని ప్రాముఖ్యతను తెలియజేస్తాయి.
విజ్ఞానం–ఆధ్యాత్మికం కలిసినప్పుడు…
విజ్ఞానం చంద్రుని నేలను కొలుస్తుంది. ఆధ్యాత్మికం మనిషి హృదయాన్ని కొలుస్తుంది. విజ్ఞానం విశ్వ రహస్యాలను తెలుసుకోవాలని ప్రేరేపిస్తే, ఆధ్యాత్మికం జీవిత రహస్యాలను అర్థం చేసుకోవాలని బోధిస్తుంది. ఈ రెండూ పరస్పర విరుద్ధాలు కావు..పరస్పర పూరకాలు. మానవాళి నిజమైన అభివృద్ధి ఈ రెండింటి సమన్వయంలోనే ఉంది.
భవిష్యత్తు చంద్రుడి వైపే…
నేడు చంద్రుడు కేవలం పరిశోధనలకే పరిమితం కాలేదు. అక్కడ శాశ్వత స్థావరాల ఏర్పాటు, ఖనిజ సంపద వినియోగం, మానవ నివాసాల నిర్మాణం వంటి లక్ష్యాలతో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. రానున్న దశాబ్దాల్లో చంద్రుడు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆకాశంలో కనిపించే తెల్లని చంద్రబింబాన్ని చూస్తూ పాటలు పాడిన మనిషి… అదే చంద్రుడిపై తన పాదముద్రను ముద్రించాడు. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు. మానవ సంకల్పానికి, జిజ్ఞాసకు, ధైర్యానికి ప్రతీక. అయితే విశ్వాన్ని జయించే క్రమంలో మనిషి తన మనసును, మానవీయ విలువలను కోల్పోకూడదు. విజ్ఞానం మన చేతులను శక్తివంతం చేస్తే, ఆధ్యాత్మికం మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. ఈ రెండింటి సమతుల్యతే భూమిపైనైనా, చంద్రుడిపైనైనా మానవజాతి భవిష్యత్తుకు నిజమైన వెలుగుబాట.
-ఎస్.వి.రమణా చారి,
సీనియర్ జర్నలిస్ట్
సెల్: +91 98498 87086
Also Read: వివాహబంధంలోకి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్..



