కేంద్రం నుంచి పైసా రాలేదు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ… ఆరున్నరేళ్లలో కేంద్రం నుంచి ఒక్కపైసా సాయం కూడా రాలేదని మత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో రూపొందించిన చట్టాన్నే కేంద్రం తుంగలో తొక్కిందన్నారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానం ఇస్తూ.. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో పారిశ్రామీకీకరణకు సహాయం చేయాలని, రాయితీలు ఇస్తామని పేర్కొన్నప్పటికీ ఎలాంటి సాయం అందలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుందన్నారు. ఆరున్నరేండ్లలో తెలంగాణకు కేంద్రం అణా పైసా కూడా సహాయం చేయలేదు. కేంద్రం తెలంగాణకు చేసింది గుండు సున్నా అని ధ్వజమెత్తారు. వారు పార్లమెంట్లో చేసిన చట్టాన్నే తుంగలో తొక్కుతున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రం తెచ్చిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికి తెలియదన్నారు. ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజీ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. కేవలం వీధి వ్యాపారులకు మాత్రమే రూ. 10 వేల రుణసాయం పొందేందుకు కొంత మేర ఉపయోగపడినట్టు తెలుస్తోందన్నారు.
రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో పండే పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సిఎం కెసిఆర్ దిశానిర్ధేశంతో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మ్యాప్ రూపొందించామన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రారంభం కాగా మరికొన్ని జిల్లాల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.