కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి

కాబుల్ (CLiC2NEWS): అంతా అనుకున్నట్లే జరిగింది. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల భారీ పెలుడు సంభవించింది. అఫ్ఘాన్ నుంచి తమ దేశ పౌరులను ఆయా దేశాలు తరలిస్తున్న వేళ గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసకుంది. ఆత్మాహుతి దాడి అయ్యుండొచ్చని అమెరికా రక్షణ విభాగం అనుమాని్స్తోంది. ఇవి ఆత్మాహుతి దాడులేనని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఈ పేలుళ్లలో 13 మంది మరణించారని తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని చెప్పారు. తొలుత విమానాశ్రయం గేటు వద్ద పేలుడు జరిగిందని.. ఈ ఘటనలో అమెరికా సైనికులతో పాటు పౌరులు మరణించారని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ జాన్ కిర్బీ తెలిపారు. అబే గేటుకు సమీపంలోని బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరిగిందని వెల్లడించారు. ఈ దాడుల వెనక ఐసిస్ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేలుడు ఘటనతో విమానాశ్రయం పరిసరాల్లో భయానక వాతావరణం నెలకొంది. రక్తమోడుతూ ప్రాణాలను రక్షించుకోవడానికి దవఖానాకు పరుగులు పెడుతున్న క్షతగాత్రుల దృశ్యాలు బయటకొచ్చాయి. విమానాశ్రయం వద్ద ఆత్మహుతి దాడులు జరగొచ్చని అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు హెచ్చరించిన కొన్ని గొంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.