AP: రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌పై దృష్టిపెట్టాలి: సిఎం జ‌గ‌న్‌

మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి:ముఖ్య‌మంత్రి

అమరావతి (CLiC2NEWS): అక్టోబ‌రు నాటికి వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని.. ఆ వెంట‌నే రోడ్ల పై దృష్టిపెట్టాల‌ని అధికారుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సిఎం జ‌గ‌న్ ఆదేశించారు. మ‌ళ్లీ వ‌ర్షాకాలం వ‌చ్చేలోగా రోడ్ల‌న్నీ బాగు చేయాల‌న్నారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..
వ‌ర్షాల వ‌ల్ల ర‌హ‌దారులు బాగా దెబ్బ‌తిన్నాయ‌న్నారు. రోడ్లు బాగు చేసేందుకు ప్ర‌భుత్వం నిధి ఏర్పాటు చేసింద‌ని తెలిపారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలని సూచించారు.

రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారు. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాల‌ని అధికారుల‌కు సిఎం తెలిపారు. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. క్షేత్రస్థాయి నుంచి అధికారులు నివేదిక‌లు తెప్పించుకోవ‌ని సూచించారు. నివేదిక‌ల ఆధారంగా రోడ్ల ప‌నులు చేయాల‌ని పేర్కొన్నారు. సంబంధిత ప్ర‌భుత్వ విభాగాల‌తో క‌లిసి కార్యాచ‌ర‌ణ రూపిందించుకోవాల‌ని అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు.

ఈ స‌మీక్షా సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ఎం శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కె వెంకటరెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, త‌దిత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.