భారీ వర్షాలపై ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష

న్యూఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలోఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే సిఎస్ సోమేష్కుమార్, డిజిపి మహేందర్రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వర్చువల్గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షపాత వివరాలు, లోతట్టు ప్రాంతాల్లో మునకలు సహా వివిధ అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అలాగే జిల్లాల్లో వర్షపాత వివరాలు, లోతట్టు ప్రాంతాల్లో మునకలు సహా వివిధ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష చేశారు సిఎం. భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు, నాలాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు.
రానున్న రోజుల్లో భారీ వర్షలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.