ఆదిలాబాద్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్.. నలుగురికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్ (CLiC2NEWS): జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని గుడిహత్నూర్ మండలంలోని బస్టాండ్ వద్ద గురువారం ఉదయం మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ (కంటైనర్) ఢీకొట్టింది. బస్సు బస్టాండ్ నుండి రోడ్డు ఎక్కే క్రమంలో లారీ ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కంటైనర్ డ్రైవర్తో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దారికి అడ్డంగా ఉన్న ఈ రెండు వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారని, వారికి స్వల్ప గాయాలు మినహా ఏమి కాలేదని పోలీసులు తెలిపారు.