విజయవాడలో ఉద్యోగుల భారీ నిరసన ప్రదర్శన..
అమరావతి (CLiC2NEWS): ఎపి ప్రభుత్వం పిఆర్సి జిఒలకు వ్యతిరేకంగా చేపట్టిన చలో విజయవాడకు భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేసినా వాళ్లను ఛేదించుకుని మరీ విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజవాడలోని ఎన్జీవో భవన్ నుండి అలంకార్ థియేటర్ కూడలి మీదుగా బిఆర్టిఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీగా తరలివచ్చారు.
ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. పిఆర్సి జిఓలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.