ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు
ఢిల్లీ (CLiC2NEWS): జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్దమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆగస్టు 5, 2019న కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆగస్టు 6, 2019న ఎంఎల్ మిశ్రా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుండి పలు పిటిషన్లు దాఖలైయ్యాయి. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపి.. తాజాగా తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. వచ్చే ఏడాది సెప్టెండర్ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని.. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370తో నష్టపోయిన వారందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తామన్నారు.
2018లో డిసెంబర్ 20న జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించి, దానిని జులై 3, 2019 వరక పొడిగించారు. 2019, ఆగస్టు 5వ తేదీన జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిన కల్పించిన 370 ఆర్టికల్ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనిని సవాలు చేస్తూ ఎం ఎల్ మిశ్రా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత మరో న్యాయవాది షకీర్ షబీర్ , 2019 ఆగస్టు 10న ప్రధాన రాజకీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సైతంపిటిషన్ దాఖలు చేసింది. 2019, ఆగస్టు 28న అప్పటి సిజెఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. 2020, మార్చి 2న ఆర్టికల్ 370 రద్దు పై దాఖలైన పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 2022 ఏప్రిల్ 25న జమ్ము కశ్మీర్లోని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం జరుగుతున్న కసరత్తుపై తక్షణమే వచారణ జరపాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లపై విచారణ వేసవి సెలవులు తర్వాత జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. 2023 ఆగస్టు 2 నుండి సుప్రీం ధర్మాసనం దాఖలైన పిటిషన్లు అన్నిటిపై విచారణ మెదలు పెట్టింది.