`ధరణి` దేశానికి ట్రెండ్ సెట్టర్
మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
మేడ్చల్ : మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సేవలలో నూతన శకం ప్రారంభమైంది. టిఆర్ ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
నవంబర్ 2వ తేదీ నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు వెంటనే పూర్తయ్యేలా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. రెవెన్యూ డిపార్టుమెంట్లో దీన్నొక నవశకంగా చూడవచ్చు. రెవెన్యూ విధానంతో పూర్తిగా పారదర్శకత ఉండాలని, ఎక్కడ అవినీతి ఉండవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరంగా, పారదర్శంగా ఉండే విధంగా ఆన్ లైన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 570 (హైదరాబాద్ జిల్లా మినహా) మండలాల్లో ఈ సేవలు నేటి నుంచి రైతులకు అందనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు… 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. పెండింగ్లో ఉన్న పార్ట్ బీ కేటగిరీ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ విధానంలో ఒకేసారి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగనున్నాయి.

ధరణి పోర్టల్ ఇండియాకే ట్రెండ్ సెట్టర్
ఈ ధరణి పోర్టల్ ప్రారంచిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. . “ ధరణి పోర్టల్ ఇండియాకే ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుంది… ఒకప్పుడు భూమి ఉత్సత్తి సాధన మాత్రమే.. సాగువిధానంలో అధునాత మార్పులు వచ్చి ఆస్తిగా మారింది. రైతులకు భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలనే ధరణి పోర్టల్ను రూపకల్పనచేశాం. కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్లో ఉన్నాయి. విదేశాలలో ఉన్నవారు కూడా భూముల వివరాలు చూసుకోవచ్చు. ధరణిలో అక్రమ రిజిస్ట్రేషన్లకు తావులేదు. తప్పు చేసే అధికారం నాకు లేదు. ఒక తప్పు జరిగితే భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడుతాయి. తప్పటడుగులు లేకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఏ దేశంలో ఉన్నా మీ భూమి వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కొత్తగా జరిగే క్రయ, విక్రయాల రిజిస్ర్టేషన్ల ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఒక వేళ డాక్యుమెంట్ రైటర్ల సహాయం కావాలంటే వాళ్లు అందుబాటులో ఉంటారు. డాక్యుమెంట్ రైటర్లు గతంలో లాగా ఎలా పడితే అలా రుసుం వసూలు చేసేందుకు వీల్లేదు. డాక్యుమెంట్ రైటర్లు తీసుకోవాల్సిన రుసుం కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది.డాక్యుమెంట్ రైటర్ల పేర్లను జిల్లా కలెక్టర్లు ప్రకటిస్తారు.“ అని సిఎం వివరించారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు..
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవని సిఎం స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ రూపకల్పన కోసం దాదాపు 200 సమావేశాలు నిర్వహించామని గుర్తు చేశారు. మూడు చింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కిందని సిఎ కెసిఆర్ అన్నారు. తెలంగాణ ముద్దు బిడ్డా వీరారెడ్డి 1969లో రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారిలో అగ్రగణ్యుడని గుర్తు చేశారు. ఆ మహనీయుడు పుట్టిన గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు.
[…] `ధరణి` దేశానికి ట్రెండ్ సెట్టర్ […]