కాంగ్రెస్కు మరో షాక్.. దాసోజు శ్రవణ్ రాజీనామా
హైదరాబాద్ (CLiC2NEWS): కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. దాసోజు శ్రవణ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. బానిస బతుకు ఇష్టం లేకనే పార్టీని వీడుతున్నానని ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రకటించారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారనే కృతజ్ఞతతో.. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఎఐసిసి అధికార ప్రతినిధి స్థాయికి చేరుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో కులం, ధనం చూసి ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీలో ఏర్పడ్డ పరిస్థితులు నన్ను కలచివేస్తున్నాయని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో బిసి, ఎస్సిలను బలహీనపరుస్తున్నారని, కొప్పుల రాజు, జైరామ్ రమేశ్ లాంటి వారు తెలంగాణ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కానీ ఇవాళ ఎవరూ స్పందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు.