TS: నేత‌న్న‌ల‌కు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపిన సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్‌లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో, గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామన్నారు.

బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు భరోసానిస్తున్నామన్నారు. వారి ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని సీఎం తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను గుర్తించి సత్కరించుకుంటున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు అందిస్తున్నామని సీఎం అన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం, నేతన్నలకు చేయూత, చేనేత మిత్ర వంటి పథకాల ద్వారా చేనేత సొసైటీలకు ప్రభుత్వం వాటా ధనాన్ని అందించడం, కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు సబ్సిడీలు అందించడం, చేనేత మగ్గాలను ఆధునీకరించడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి విజయవంతగా అమలు చేస్తున్నదని సీఎం తెలిపారు

Leave A Reply

Your email address will not be published.