ప్రమాదానికి కారణమైన గుత్తేదారుకి ఏడాది జైలు శిక్ష..
మంచిర్యాల (CLiC2NEWS): ఎలాంటి హెచ్చరికలు లేకుండా మట్టికుప్పలను రోడ్ పై వదిలేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి కారణమైన రామగుండం నగరపాలక సంస్థ గుత్తేదారు జంగపల్లి విశ్వతేజ కి సంవత్సరం జైలు శిక్ష , రూ.3 వేల జరిమానా విధిస్తూ ఖని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్ రెడ్డి తీర్పునిచ్చారు.
ఒసిపి 3 లో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్న మంచిర్యాల్ గౌతమినగర్ కు చెందిన మేడిపల్లి నారాయణ ఈ నెల 20వ తేదీన ఉదయం విధులకని తన ద్విచక్ర వాహనం పై బయలుదేరాడు. పోతన కాలనీ పాత పెట్రోల్ బంక్ సమీపం లో పైప్ లైన్ మరమ్మతులు పనులు కొనసాగుతున్నాయి. గుత్తేదారు గోదావరిఖని ఇందిరానగర్ కు చెందిన జంగంపల్లి విశ్వతేజ.. నిర్లక్ష్యం గా ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకుండా మట్టికుప్పలను రోడ్ పై ఉంచగా వాటిని తప్పించ బోయి న నారాయణ అదుపుతప్పి తన ద్విచక్రవాహనం పై నుంచి క్రింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.