Hyderababad: అడుగడుగునా తనిఖీలు.. వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో.. ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత రహదారులపైకి వచ్చిన వాహనాలను భాగ్యనగర పోలీసులు సీజ్ చేస్తున్నారు. నగరంలోని 330 తనిఖీ కేంద్రాల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని వాహనాలను జప్తు చేస్తున్నారు. ఆస్పత్రుల నుంచి దృవీకరణ పత్రాలు ఉన్న వారికే అనుమతి ఇస్తున్నారు. రాష్ర్టంలో లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.