India Corona: 4 వేలు దాటిన రోజువారీ మరణాలు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం భారీ స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో మరోసారి రోజువారి మరణాలు 4 వేలు దాటాయి. కేసులు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ 3.5 లక్షలకు లోపే నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 19,83,804 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యా ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్యలో కరోనా బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. కాగా ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 2,54,197 కు చేరింది.
మొదటి నుంచి అత్యధిక కేసులు నమోదవుతూ వస్తున్న మహారాష్ట్రలో రోజువారీ కేసులు తగ్గుతుండగా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో క్రమంగా అధికమవుతున్నాయి. 26 రాష్ట్రాల్లో 15 శాతం పాజిటివిటీ రేటు ఉండగా, ఈ రాష్ట్రాల్లో మాత్రం 25 శాతం పాజిటివిటీ రేటు నమోదవుతున్నది.