సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతి తో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా శనివారం మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుంటుంబసభ్యులు తెలిపారు.
దాదాపు 60 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమకు సేవలందించిన కైకాల కృష్ణా జిల్లాలో 1935, జూలై 25న కౌతవరంలో జన్మించారు. ఇప్పటి వరకు దాదాపు 777 సినిమాల్లో నటించారు. హీరో, ప్రతినాయకుడు, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కైకాల అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. యమధర్మరాజు, దుర్యోదనుడు, ఘటోత్కచుడు, కర్ణుడు, రావణాసురుడు పాత్రల్లో మెప్పించారు.
1994 లో బంగారు కుటుంబం చిత్రంలో కైకాల అద్భుత నటనకు నంది పురస్కారం లభించింది. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 1996లో మంచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.