1 నుండి 5వ తరగతి వరకు హిందీ బోధన.. స్కూళ్ల మూసివేతకు వెనుకాడం..
Raj Thackeray : మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరి చేస్తే పాఠశాలలను మూసేందుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. ఠాణె జిల్లాలో మీరా భయందర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. మాహారాష్ట్ర ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని.. హిందీని తప్పనిసరి చేస్తే ఎంటువంటి ప్రభుత్వ ప్రణాళికనైనా విఫలం చేయాలని పిలుపునిచ్చారు. హిందీని తప్పనిసరి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని.. అది దురదృష్టకరమన్నారు. ఓ సారి త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసేందుకు ప్రయత్నిస్తే.. దుకాణాలను మూసివేశామని, మళ్లీ ప్రయత్నిస్తే ఈ సారి పాఠశాలలను మూసివేసేందుకు వెనకాడమని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. హిందీకి రెండు శతాబ్దాల చరిత్ర ఉంటే.. మరాఠీకి రెండున్నర, మూడు వేల ఏళ్ల చరిత్ర ఉందన్నారు.
హిందీ భాషను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలనే నిర్ణయంపై రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో త్రిభాషా విధానం అమలుపై ఇచ్చిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర సర్కార్ ఉపసంహరించుకుంది. దీనిపై విద్యావేత్త నరేంద్ర జాదవ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. 1నుండి 5వ తరగతి వరకు హిందీ బోధించాలా.. వద్దా అనేదానిపై కమిటి నిర్ణయం తీసుకుంటుందని సిఎం పేర్కొన్నారు. అయినప్పటికీ త్రిభాషా విధానాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ప్రవేశపెడుతుందని సిఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వ్యతిరేకతలు తీవ్రమవుతున్నాయి.