కేంద్రంతో కలిసి పనిచేస్తాం: సిఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి (CLiC2NEWS): రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. జహీరాబాద్ నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్గా జహీరాబాద్ నిలిచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నిసార్లైనా కలుస్తానని సిఎం తెలిపారు. ఎన్నికలు వచ్చినపుడే రాజకీయాలని.. ఎన్నికల తర్వాత అభివృద్దే లక్ష్యమన్నారు. ఎవరేమనుకున్నా తనకు ఇబ్బంది లేదని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం సాయం తీసుకుంటామన్నారు. పటాన్ చెరు ప్రాంతం మినీ ఇండస్ట్రీలాంటిదని.. ఇందిరమ్మ ప్రధానిగా ఉన్నపుడే అభివృద్ది జరిగిందన్నారు. సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కింద తీర్చిదిద్దుతామన్నారు.