పిఎస్​ఎల్వీ సి-51 ప్ర‌యోగం స‌క్సెస్‌

శ్రీహరికోట: భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త‌ల కృషి ఫ‌లించింది. ఇస్రో మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ ఏడాదిలో నిర్వహించిన తొలి ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా స‌తీశ్ ధ‌వ‌న్ స్పేస్ సెంట‌ర్ షార్ నుంచి చేప‌ట్టిన రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. ఆదివారం ఉదయం 10.24గంటలకు పీఎస్‌ఎల్‌వీ శాటిలైట్‌ దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను, భగవద్గీత కాపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో, పేరు, ఆత్మనిర్భర్‌ మిషన్‌ పేరు సహా 25 వేల పేర్లను నింగిలోకి తీసుకెళ్లింది. ఇందులో విదేశాలకు చెందిన వెయ్యి మంది, చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లు సైతం ఉన్నాయి. అమోజోనియా-1, మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భూపర్యవేక్షణకు అమోజోనియా-1 శాటిలైట్‌ కీలకం కానుంది.

ఇస్రో ఈ యేడాది చేప‌ట్టిన మొద‌టి ప్ర‌యోగం ఇది. ఈ ప్ర‌యోగం నేప‌థ్యంలో షార్‌లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. శ్రీహరికోటలోని షార్​ నుంచి జరిగిన ఈ ప్రయోగాన్ని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ ప్రత్యక్షంగా వీక్షించారు. బ్రెజిల్కు చెందిన అమోజోనియా-1 ఉప‌గ్ర‌హాన్ని క‌క్ష్య‌లోకి పంపారు. ఈ ప్ర‌యోగం విజ‌యం ప‌ట్ల శాస్త్రవేత్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ
“ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో చేప‌ట్టిన మొద‌టి ప్ర‌యోగం గ‌ర్వంగా ఉంది. బ్రెజిల్ జ‌ట్టుకు అభినంద‌న‌లు. దేశీయ‌, ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు చెందిన 19 ఉప‌గ్ర‌హాలు క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టాం“ అని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.