బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ట్రస్
లండన్ (CLiC2NEWS): బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ట్రస్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన విషయం తెలిసినదే. లిజ్ ట్రస్ బ్రిటన్ మూడవ మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్న లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికయ్యారు.
నూతన ప్రధానిగా ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ కూడా ఉన్నారు. లిజ్ ట్రస్, రిషి సునాక్ మధ్య హోరా హోరీగా సాగిన పోరులో లిజ్ విజయం సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికలలో రిషి సునాక్కు 60,339 ఓట్లు రాగా.. లిజ్ ట్రస్కు 81,326 ఓట్లు వచ్చాయి. సుమారు 21వేల ఓట్ల మెజారిటీతో లిజ్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా లిజ్ ట్రస్ తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని, వచ్చే రెండేళ్లలో పన్నులు తగ్గించి ఆర్ధిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు ప్రణాళికలు అందిస్తానని తెలిపారు.