తల్లిని గెంటేసిన కుమారులకు బుద్దిచెప్పిన రెవెన్యూ అధికారులు
హైదరాబాద్ (CLiC2NEWS): తల్లిని ఇంట్లోనుండి వెళ్లగొట్టిన కుమారులకు తగిన విధంగా బుద్దిచెప్పారు రెవెన్యూ అధికారులు. నగరంలోని మలక్ పేట మూసారాంబాగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శకుంతలా బాయికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆమె భర్త మరణించిన అనంతరం కొడుకులతో కలిసి ఉండేది. కానీ ఇటీవల తన ఇంటినుండే కొడుకులు గెంటేయడంతో చిన్న కుమార్తె వద్దకు వెళ్లి ఉంటోంది. 2024 ఫిబ్రవరిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆ వృద్ధురాలు హైదరాబాద్ జిల్లా ఆర్డిఒను ఆశ్రయించింది.
శకుంతలాబాయి ఇద్దరు కుమారులను పిలిపించి ఆర్డిఒ కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేకాక ఇంటిని తమ తల్లికి అప్పగిస్తామని ఒప్పుకున్నారు. రోజులు, నెలలు గుడుస్తున్నా ఇంటిని తల్లికి అప్పగించలేదు. దీంతో వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు.రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. గడువు ముగియడంతో సైదాబాద్ తహశీల్దార్ ఇంటిని సీజ్ చేశారు.