కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
న్యూఢిల్లీ (CLiC2NEWS): భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపీ కోరారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఇవాళ కిషన్ రెడ్డిని కలసి ఈమేరకు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైన సందర్భంగా అభినందనలు తెలిపారు. పర్యాటక రంగంలో నూతన మార్పులు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట అభివృద్ధికి సహకరించడం లేదని కిషన్ రెడ్డికి కోమటిరెడ్డి వెల్లడించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి.. వెంటనే నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కోమటి రెడ్డి వెంటరెడ్డి ఇవాళ కేంద్ర మంత్రిని కలవడం సాధారణమే అని తెలుస్తున్నప్పటికీ.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటుండటంతో ఈ భేటీ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.