వరద నీటికి కరిగిపోయిన రూ.50కోట్ల విలువైన చక్కెర
యమునా నగర్ (CLiC2NEWS): అసియాలోనే పెద్దదైన షుగర్మిల్లులోకి వరద నీరు చేరి కోట్ల రూపాయల విలువైన పంచదార కరిగిపోయింది. ఈ ఘటన హరియాణలో చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆసియాలో అతిపెద్ద షుగర్ మిల్ అయిన ‘సరస్వతి షుగర్ మిల్’ లో దాదాపు రూ.50కోట్ల విలువైన పంచదార కరిగిపోయింది. హరియాణా లోని యమునా నగర్లో ఈ మిల్ ఉంది. యమునా నగర్ ప్రాంతంలోని గిడ్డంగిలో 2.20 లక్షల క్వింటాళ్ల పంచదారను నిల్వ చేసినట్లు సమాచారం. దీని విలువ రూ.97 కోట్లు ఉంటుందని అంచనా. రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలు కారణంగా పక్కనే ఉన్న కాల్వ పొంగి నీరు మిల్లులోకి చేరినట్లు మిల్ యజమాని వెల్లడించారు. మిల్లు పక్కనే ఉన్న కాల్వ ఆక్రమణకు గురికావడంతో నీరు ఒక్కసారిగా పొంగి మిల్లులోకి చేరిందన్నారు. దీంతో దాదాపు రూ.50 కోట్ల విలువైన చక్కెర కరిగిపోయిందని ఆయన తెలిపారు.
దేశ వ్యాప్తంగా పలు చోట్ల మరో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ ( ఐఎండి ) వెల్లడించింది. దీంతో పలు రాష్ట్ర్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహా రాష్ట్ర, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు వరద ముప్పు పొంచిఉంది. దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.