ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మ‌హాధ‌ర్నా..

ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద మ‌హాధ‌ర్నా చేప‌ట్టారు. తెలంగాణ‌లో విద్య‌, ఉద్యోగాలు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బిసి రిజ‌ర్వేష‌న్లు 42%కి పెంచుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం బిల్లును ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రప‌తికి పంపిన ఈ బిల్లును వెంట‌నే ఆమోదం తెల‌పాల‌న్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మ‌హాధ‌ర్నా చేపట్టారు. ఈ ధ‌ర్నాలో రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, పిసిసి అధ్య‌క్షుడు ముఖేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, సీత‌క్క‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌దిత‌ర ముఖ్య నేత‌లు పాల్గొన్నారు. ఈ మ‌హాధ‌ర్న ముగింపు కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పాల్గొంటారు.

ఈ సంద‌ర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బిజెపి నేత‌లు బిసి రిజ‌ర్వేష‌న్ బిల్లుల‌ను అడ్డుకొని బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అన్యాయం చేస్తున్నార‌న్నారు. బిసిల‌కు 42% రిజ‌ర్వేష‌న్లు ఎలాగైనా సాధిస్తామ‌ని అన్నారు. జంత‌ర్ మంత‌ర్ వేదిక‌గా ప్ర‌ధాన‌మంత్రి మోడీకి, ఎన్‌డియేకు స‌వాల్ విసురుతున్నాన‌న్నారు. మా డిమాండ్ ఆమోదిస్తారా.. మిమ్మ‌ల్ని గ‌ద్దె దించాలా, మా ఆలోచ‌న‌లు , బిల్లుల‌ను తుంగ‌లో తొక్కే అధికారం మీకు ఎవ‌రిచ్చారని సిఎం ప్ర‌శ్నించారు.

బిసి రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి అండ‌గా ఉంటామ‌ని ఎంపి క‌నిమొళి తెలిపారు. త‌మిళ‌నాడులో 69% రిజ‌ర్వేష‌న్లు అమ‌లవుతున్నాయని తెలిపారు. న్యాయానికి ఎలాంటి ప‌రిమితులు ఉండ‌కూడ‌ద‌ని, రిజ‌ర్వేష‌న్లు 50% ఉండాల‌ని ఎవ‌రూ చెప్ప‌లేర‌ని క‌నిమొళి వెల్ల‌డించారు.

Also Read: AP: పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూలు బ‌స్సు

Leave A Reply

Your email address will not be published.