ప్రియురాలికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన యువకుడు.. యువతి ఆత్మహత్య
హైదరాబాద్ (CLiC2NEWS):పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలికి హెచ్ ఐవి రక్తాన్ని ఎక్కించాడు ఓ యువకుడు. ఈ ఘటనలో బాధితురాలు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నాళ్లుగా వారిరువురి మధ్య ప్రేమ కొనసాగింది. ఇటీవల ఆ యువకుడికి హెచ్ ఐవి ఉన్నట్లు తేలడంతో ఆమె వివాహానికి నిరాకరించినట్లు సమాచారం. జనగామ జిల్లాకు చెందిన యువకుడు నగరంలో ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రులకు హెచ్ ఐవి పాజిటివ్ ఉంది. తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు.
యువకుడి ఇంటికి సమీపంలోనే ఉండే ఓ యువతిని ఇష్టపడగా.. దానికి పెద్దలు కూడా సమ్మతించడంతో వారి మధ్య కొన్నేళ్లగా ప్రేమ కొనసాగింది. ఇటీవల పెళ్లికి సిద్దమయ్యారు. అయితే, యువతి తండ్రి యువకుడికి రక్త పరీక్షలు చేయించాడు. వ్యాధి ఉన్నట్లు తేలడంతో వివాహం రద్దు చేసుకున్నారు. దీంతో ఎలాగైనా ప్రియురాలిని దక్కించుకోవాలని యువకుడు తన రక్తాన్ని నింపిన సిరంజితో గత నెల 11వ తేదీన యువతి ఇంటికి వెళ్లాడు, మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో .. తన వెంట తెచ్చిన సిరంజిలోని రక్తాన్ని బలవంతంగా ఆమెకు ఎక్కించాడు. పోలీసులకు అందిన ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.