రెండు బస్సులు, లారీ ఢీ.. ఐదుగురి మృతి!
విజయనగరం: విజయనగరం జిల్లా సుంకర పేట వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. అదే సమయంలో వైజాగ్ నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనక వైపు నుంచి బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. రెండు బస్సుల్లోని మరో 30 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉండటంతో ఈ తెల్లవారుజామున చెత్తను తగులబెట్టారు. దీంతో పొగ రహదారిని కమ్ముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలకు దారి కనిపించకపోవడం, వాహనాలు అతివేగం కారణంగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
