తెలంగాణలో 3 రోజులు వడగాలులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం 38.8 నుంచి 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 42.8 డిగ్రీలుగా రికార్డయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఉత్తర దిశనుంచి అతి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ గాలుల ప్రభావంతో ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.