కామారెడ్డి: రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
కామారెడ్డి (CLiC2NEWS): రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ నాగరాణి జడ్జ్ లు పాల్గొని విద్యార్థులు, వాహనదారులు, ప్రజలతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణం వాహనదారుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనేనని ఉద్ఘాటించారు. ప్రతి వాహనదారుడు తమ ప్రాణాలనే కాకుండా, తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనం నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చనని ఎస్పి తెలిపారు. గతంలో చేపట్టిన ‘కిడ్స్ విత్ ఖాకీ’ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు రోడ్డు భద్రత అంబాసిడర్లుగా మారి సమాజంలో మంచి మార్పు తీసుకువచ్చారని జిల్లా ఎస్పి ప్రశంసించారు.