కాళేశ్వరం విచారణ సిబిఐకి అప్పగించడం .. ప్రాజెక్టును ఎండబెట్టడమే: కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): కాళేశ్వరంపై విచారణను ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం.. ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమేనని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, బంగారు తెలంగాణ నిర్మాతగా చరిత్ర సృష్టించిన కెసిఆర్పై విష ప్రచారం చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో సిఎం ఉన్నారన్నారు. కాళేశ్వరంపై విచారణ సాకుతో ప్రధాని మోడీతో కలిసి సిఎం కుట్ర పన్నుతున్నారన్నారు. ఇది కేవలం కెసిఆర్, బిఆర్ ఎస్ పైనే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసే పరిస్తితి నెలకొనేలా ఉందని కెటిఆర్ విమర్శించారు. ఆయన సోమవారం పార్టి నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు.
గతంలో సుంకిశాలలో సైడ్ వాల్ కూలిపోయినా, ఎస్ ఎల్బిసి టన్నెల్ కుప్ప కూలిపుడు , వట్టెం పంప్ హౌజ్ కూలిపోయినా, పెద్దవాగు రెండు సార్లు కొట్టుకుపోయినపుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్నారు. ఇన్ని జరిగినా రాని జాతీయ డ్యామ్ భద్రతా అథారిటి , మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే మాత్రం ఆగమేఘాలమీద వచ్చాయని ఆరోపించారు. బెదిరింపులు, కేసులు కొత్తేం కాదన్న కెటిఆర్.. రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎన్ని పోరాటాలకైనా, త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నట్లు కెటిఆర్ తెలిపారు.
అసెంబ్లీలో ఆదివారం కాళేశ్వరం నివేదికపై అధికార , విపక్ష సభ్యుల మధ్య సుదీర్థ చర్చ కొనసాగిన విషయం తెలిసిందే. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నిజ నిర్ధారణ చేయడానికి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది.