రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మృతి
పాడేరు (CLiC2NEWS): విశాఖనగరంలోని ఆరిలోవ ప్రాంతం దీన్దయాల్పురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంపై ఆరిలోవ ఎస్ఐ గోపాలరావు తెలిపిన వివరాల మేరకు..
పాడేరు మండలం లగిశపల్లికి చెందిన సత్యవేణి (45) జి మాడుగుల మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. భర్త శ్రీములు ఐటిడిఎ కాఫీ విభాగంలో హుకుంపేట మండలం సబ్ అసిస్టెంట్గా విధుల నిర్వహిస్తున్నారు. వీరి ముగ్గురు పిల్లలు చదువుల నిమిత్తం నగరంలోని సుజాతనగర్లో ఉంటున్నారు. భార్యాభర్తలు వారాంతంలో పిల్లల వద్దకు వస్తుంటారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సత్యవేణి పిల్ల వద్దకు వచ్చారు. ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తె మౌనిక (24)తో కలిసి ఆదివారం పి. ఎం. పాలెంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లి.. అనంతరం తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మౌనిక సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచింది. సత్యవేణిని ఆరిలోవ పోలీసులు హెల్త్సిటీలో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్ తెలిపారు. కాగా తల్లీ కూతుళ్ల మృతితో స్వగ్రామమైన పాడేరు,మండలం లగిశపల్లిల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.