కేంద్ర ఐటి మంత్రికి కెటిఆర్ లేఖ
హైదరాబాద్: ఐటీ పరిశ్రమలో అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్కు సమాన హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కి మంత్రి కెటిఆర్ లేఖరాశారు. గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందన్నది ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కన్నా ఎన్నో రెట్లు వృద్ధిని హైదరాబాద్ నగరం కనబరుస్తుందన్నారు. కొవిడ్ సంక్షోభంలోనూ తెలంగాణ ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయని తెలిపారు. జాతీయ సగటు 1.9% ఉండగా తెలంగాణ 7శాతం వృద్ధిరేటుతో 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం అని మంత్రి పేర్కొన్నారు. ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక పాలసీ ద్వారా కేంద్రం ప్రోత్సాహం అందించాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్ పైన తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని మంత్రి పేర్కొన్నారు.
ఐటీ అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరానికి కేంద్రం ప్రత్యేక ప్రోత్సహం అందించాల్సిన అవసరం ఉందని కోరారు. రాష్ట్ర ఏర్పాటు నాటి ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. సీఎం కేసీఆర్ సైతం ఈ విషయాన్ని అనేక సార్లు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఐటీ దాని అనుబంధ పరిశ్రమల ప్రాధాన్యం గుర్తించి ఐటీఐఆర్ హోదాని ఇవ్వాలి లేదా దానికి సమానమైన ప్రోత్సాహాన్ని ఇవ్వాలి.. అని కేంద్ర మంత్రిని లేఖలో మంత్రి కెటిఆర్ కోరారు.