Kamareddy:కామారెడ్డిలో వ‌ర‌ద బీభ‌త్సం

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లాలో ఎడ‌తెరిపిలేకుండా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వాన‌ల‌కు జిల్లాలోని తిమ్మారెడ్డి క‌ల్యాణి వాగు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఎల్లారెడ్డి మండలంలోని బొగ్గు గుడిసె స‌మీపంలో బ్రిడ్జి నిర్మాణ ప‌నులు చేప‌డుతున్న కార్మికులు ఆరుగురు చిక్కుకుపోయారు. వారంతా డిసిఎంలో అమ‌ర్చిన వాట‌ర్ ట్యాంక్ ఎక్కి కాపాడండని కేక‌లు వేయ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మై వారంద‌రిని ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీసులు సుర‌క్షితంగా ర‌క్షించారు.

వ‌ర‌ద‌లో చిక్కుకున్న వారిని కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది, పోలీసులు

అలాగే భిక్క‌నూర్ స‌మీపంలో రైలు ప‌ట్టాల కింద గండి ప‌డ‌డంతో రైళ్ల ప్ర‌యాణాలు స్తంభించిపోయాయి. తలమడ్ల దగ్గర రైలు పట్టాల పైనుంచి వరద ప్రవాహం భారీగా ప్రవహిస్తుంది. దాంతో 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్ప‌డింది. మ‌రో నాలుగు రైళ్లను అధికారులు దారి మ‌ళ్లించారు. అధికారులు, సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులను చేప‌ట్టారు.

భిక్క‌నూర్ స‌మీపంలో రైలు ప‌ట్టాల‌కు గండిప‌డిన దృశ్యం

ఎల్లారెడ్డి మండలం అన్నా సాగర్ వరదల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే చ‌ర్య‌లను జిల్లా ఎస్పి సంఘటన స్థలంలో ఉండి స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఘట‌న‌లో మొత్తం తొమ్మిది మంది బాధితుల‌ను ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ఒడ్డుకు త‌ర‌లించారు.

కామారెడ్డిజిల్లా రాజంపేట మండ‌ల కేంద్రంలో భారీ వ‌ర్షాల‌కు దేవుని చెరువు క‌ట్ట తెగిపోయింది. ఆ ప్ర‌వాహాని గోడ కూలిన ఘ‌ట‌న‌లో గుండారం ప‌ల్లెలో డాక్టర్ విన‌య్ కుమార్ అనే వ్య‌క్తి దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు..

జిల్లా లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు కామారెడ్డి నుంచి హైద‌రాబాద్ వెల్లే నేష‌న‌ల్ హైవే జంగంప‌ల్లి వ‌ద్ద వ‌ర‌ద నీరు రోడ్డుపైనుంచి ప్ర‌వ‌హిస్తోంది. దీంతో అధికారులు ఆ రోడ్డును మూసివేశారు.


తిమ్మారెడ్డిలో వ‌ర‌ద ఉధృతి దృశ్యం

ఎల్లారెడ్డి, నిజాంసాగర్ ప్రధాన రహదారిలో కొట్టాల్ దగ్గర భారీ నీటి ప్రవాహానికి వంతెన కూలిపోయింది. దాంతో కామారెడ్డి -ఎల్లారెడ్డి రహదారి మూసివేశారు.

జిల్లాలోని లింగయ్య పల్లి గ్రామం, సారంపల్లి గ్రామం వ‌ద్ద 2 వాగులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. కల్కి నగర్ లో ఇళ్లలోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది.
కామారెడ్డి లో గురువు రాఘవేంద్ర కాలనీలో మొదటి అంతస్తు వరకు కొన్ని ఇళ్లు వరద ప్రవాహంలో చెక్కుకున్నాయి.

దోమ‌కొండ‌లో కుండ‌పోత‌
దోమకొండ మండలంలో మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం జ‌న‌జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఇక్క‌డ పలు కాలనీలు నీట మునిగిపోయి, ఇళ్లలోకి మోకాళ్ళ లోతు వరదనీరు చేరింది. రాజీవ్ నగర్, ముత్యాలమ్మ, వివేకానంద, శాంతినగర్, రజక కాలనీలు తీవ్రంగా వ‌ర‌దతో నిండిపోయాయి.
వర్షం కారణంగా రోడ్డుమీదికి వరదలు చేరడంతో అంచనూర్, సంగమేశ్వర్, గొట్టి ముక్కుల, అంబర్పేట్, ముత్యంపేట్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పోచారం ప్రాజెక్టు వ‌ద్ద భారీ వ‌ర‌ద దృశ్యం

 

కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వ‌ర‌ద తీవ్ర‌త భారీగా ఉంది. ఇక్కడ వ‌ర‌ద దాటికి ఐదు కార్లు కొట్టుకుపోయాయి. ప‌లు ఇళ్లు నీట మునిగాయి. ప‌రిస్థితి హృద‌య‌విదార‌కంగా త‌యారైంది.

కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వ‌ర‌ద‌లో కొట్టుకుపోతున్న కార్లు
3 Comments
  1. […] Kamareddy:కామారెడ్డిలో వ‌ర‌ద బీభ‌త్సం […]

  2. […] Kamareddy:కామారెడ్డిలో వ‌ర‌ద బీభ‌త్సం […]

  3. […] Kamareddy:కామారెడ్డిలో వ‌ర‌ద బీభ‌త్సం […]

Leave A Reply

Your email address will not be published.